మీర్పేట్, బడంగ్పేట్ (Badangpet.in):
నాగార్జున స్కూల్స్ – మీర్పేట్ బ్రాంచ్లో నిన్న పదవ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు.
విద్యతో పాటు క్రమశిక్షణ ఎంతో అవసరం – చైర్మన్ విట్టల్ రెడ్డి
ఈ సభకు పాఠశాల చైర్మన్ శ్రీ జి. విట్టల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో చదువు ఎంత ముఖ్యమో, క్రమశిక్షణ అంతే కీలకమని స్పష్టం చేశారు.
కేవలం మార్కులే కాదు, మంచి అలవాట్లు, నైతిక విలువలు, సమయపాలన, బాధ్యతాయుతమైన ప్రవర్తన కూడా నిజమైన విద్యలో భాగమని తెలిపారు.
ఈ రోజు విద్యార్థులుగా ఉన్న మీరు రేపటి సమాజాన్ని నిర్మించే పౌరులని, అందుకే ఇప్పుడే కష్టపడటం, ఉపాధ్యాయులు చెప్పే మాటలను గౌరవించడం అవసరమని సూచించారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేసిన త్యాగాలను గుర్తుంచుకొని లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతరం శ్రమిస్తే విజయం తప్పక మీ సొంతమవుతుందని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు.
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – ప్రిన్సిపాల్ విజయ్
ప్రిన్సిపాల్ శ్రీ విజయ్ మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులు ఉన్నత ఆశయాలతో చదువులో మరింత ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఈ దశలో పెట్టే కృషే భవిష్యత్ జీవితానికి పునాది అవుతుందని, ధైర్యంగా లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచించారు.
సమాజం పట్ల బాధ్యతతో మెలగాలి – ఇంచార్జి టీచర్ దుర్గ
ఇంచార్జి టీచర్ శ్రీమతి దుర్గ మాట్లాడుతూ, పిల్లలు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని హితవు పలికారు. విద్యతో పాటు మానవ విలువలు, సేవాభావం కూడా జీవితంలో ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులను యాజమాన్యం చిరు కానుకలతో ప్రత్యేకంగా సన్మానించింది.
సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా ఫేర్వెల్ వేడుక
ఈ కార్యక్రమంలో తొమ్మిదవ తరగతి, పదవ తరగతి విద్యార్థులు తమ అనుభవాలు, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలతో ఫేర్వెల్ వేడుక సందడిగా కొనసాగి, భావోద్వేగ క్షణాలతో ముగిసింది.

కామెంట్ను పోస్ట్ చేయండి